దేశ వ్యాప్తంగా భానుడి ఉగ్రరూపం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. చాలా చోట్ల వడదెబ్బకు(Heat Stroke) ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాజస్థాన్లో(Rajastan) ఈ వారం వడదెబ్బ తగిలి ఏకంగా 12 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. రాజస్థాన్లో ఇవాళ గరిష్ఠంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వీరే కాకుండా చాలా మంది వడదెబ్బకు గురయ్యి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన కొందరిలో వడదెబ్బ లక్షణాలు కనిపించాయన్నారు.
జలోర్లో నలుగురు, బార్మర్లో ఇద్దరు కార్మికులు మరణించారు. అల్వార్, భిల్వారా, బలోత్రా, జైసల్మేర్లలో తీవ్రమైన వేడిగాలులు ప్రజల ప్రాణాలను బలితీసుకున్నాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని రాజస్థాన్ విపత్తు నిర్వహణ, సహాయ మంత్రి కిరోరి లాల్ మీనా చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇతర రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..
పంజాబ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వేసవి కాలంలో భారత్ విద్యుత్ వినియోగం గరిష్ఠంగా 237 గిగా వాట్లకు చేరుకుంది. ఉత్తర భారతదేశం వేడిగాలులతో అల్లాడిపోతుండగా, దక్షిణాదిలోని కేరళ, తమిళనాడులో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.


